ఆస్తుల, అప్పుల వివరాలను బహిర్గతం చేసిన ప్రధాని

గత 15 నెలల కాలంలో ఆయన చర ఆస్తులు రూ.36.53 లక్షలు పెరిగి, మొత్తం చరాస్తుల విలువ రూ.1,39,10,260 నుంచి రూ.1,75,63,618కి చేరింది. గాంధీనగర్ నగర్‌లో తన కుటుంబంతో కలిపి ఇల్లు, ఒక స్థలం ఉన్నాయి. సగటు మధ్యతరగతి వ్యక్తివలే తన జీతంలో ఎక్కువ భాగాన్ని బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లకే కేటాయించి, పొదుపు విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ లెక్కలన్నీ ఎవరివనుకుంటున్నారా! సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీవి.  తాజాగా ఆయన తన ఆస్తులు, అప్పుల వివరాలను బహిర్గతం చేశారు. ఈ గణాంకాలు జూన్‌ 30 నాటికి ఆయన ఆర్థిక స్థితిగతులను వెల్లడిస్తున్నాయి. 

ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్య ఆదాయ వనరు ప్రభుత్వం నుంచి పొందే రూ.రెండు లక్షల జీతం. దాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టడంతో పాటు, వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడం వల్ల ఆయన ఆదాయంలో వృద్ధి ఎక్కువగా కనిపిస్తోందని సన్నిహితులు తెలిపారు. అలాగే ఎప్పటిలాగే మోదీ స్థిరాస్తుల్లో ఎలాంటి మార్పులేదు. కుటుంబంతో కలిపి ఆయనకు తన స్వరాష్ట్రం గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో ఒక ఇల్లు, స్థలం ఉన్నాయి. వాటి విలువ రూ.1.1 కోట్లు. ప్రధాని ఎక్కువగా పన్ను మినహాయింపు మార్గాలను ఎంచుకుంటున్నారు. అందుకు ఆయన జీవిత బీమా, నేషనల్ సేవింగ్స్‌ సర్టిఫికేట్(ఎన్‌ఎస్‌సీస్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లలలో పెట్టుబడి పెడుతున్నారు. ఇది ఈక్విటీ మార్కెట్‌పై ఆయనకున్న స్పష్టతను తెలియజేస్తోందని వారు అంటున్నారు. అయితే, ఇటీవలి కాలంలో ఎన్‌ఎస్‌సీస్‌లో ఆయన పెట్టుబడి పరిమాణం పెరగగా, బీమా ప్రీమియంలో తగ్గుదల కనిపిస్తోంది. జూన్‌ 30 నాటికి ప్రధాని పొదుపు ఖాతాలో మోత్తం రూ.3.38లక్షలు ఉండగా, ఆయన వద్ద నగదు రూపంలో రూ. 31,450 మాత్రమే ఉన్నాయి. అలాగే ఎస్‌బీఐ గాంధీ నగర్‌ బ్రాంచ్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మొత్తం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే రూ.1,27,81,575 నుంచి రూ. 1,60,28,039కు పెరిగింది. గత సంవత్సరం ఎన్నికలు సమయంలో వెల్లడించిన వివరాలతో ఇవి సరిపోలుతున్నాయి. ఇదిలా ఉండగా,  దేశంలో  కరోనా మహమ్మారి  విజృంభణ నేపథ్యంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఇతర కెబినెట్ మంత్రులు, పార్లమెంట్ సహచరులతో పాటు తన జీతభత్యాల్లో కోత విధించుకొనేందుకు మోదీ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది