మాటు వేసి.. కాటేశాడు ప్రేమించలేదని కాల్చేశాడు

విజయవాడలో యువతి సజీవదహనం
నాలుగు రోజుల కిందట  పోలీసులకు ఫిర్యాదు, తర్వాత వాపసు
ఆ కోపంతో ఆమెపై  పెట్రోల్‌ పోసి నిప్పంటించిన వైనం
యువతి మృతి.. యువకుడికి తీవ్రగాయాలు

ప్రేమిస్తున్నానని వెంటపడి వేధిస్తున్న యువకుడిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను మళ్లీ ఆమె జోలికిరానని యువకుడు రాజీకి రావడంతో కేసు వాపసు తీసుకుంది. తన ప్రేమను కాదనడమే కాకుండా.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ యువకుడు మాటువేసి ఆమెపై దాడి చేశాడు. పెట్రోల్‌ పోసి సజీవదహనం చేశాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే చనిపోయింది. నిప్పంటుకుని తీవ్రంగా గాయపడిన యువకుణ్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి విజయవాడలోని ఓ కొవిడ్‌కేర్‌ సెంటర్‌లో నర్సుగా పనిచేస్తుంది. స్నేహితురాళ్లతో కలసి ఆసుపత్రికి సమీపంలోనే ఓ గది అద్దెకు తీసుకుని ఉంటోంది. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి చిన్నారిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీనిపై ఆమె నాలుగు రోజుల కిందట గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు, పోలీసులు ఆ యువకుణ్ని పిలిచి హెచ్చరించడంతో ఆమెను ఏమీ చేయనని రాసిచ్చినట్లు సమాచారం. దీంతో ఫిర్యాదును చిన్నారి వెనక్కి తీసుకున్నట్టు తెలిసింది.

మాటు వేసి.. కాటేశాడు
రోజూలానే సోమవారం విధులకు హాజరైన చిన్నారి రాత్రి 9 గంటలకు విధులను ముగించుకుని ఒంటరిగా ఇంటికి వెళుతుండగా, మాటు వేసిన నాగభూషణం ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నాగభూషణం ముందుగానే తనతో తెచ్చుకున్న పెట్రోల్‌ను చిన్నారిపై పోసి నిప్పంటించాడు. ఈ సమయంలో అతనికీ మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రగాయాలైన నాగభూషణాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించినట్టు సమాచారం. సంఘటనా స్థలాన్ని ఏసీపీ రమేష్‌, సూర్యారావుపేట సీఐ సూర్యనారాయణ పరిశీలించారు. ఘటనపై గవర్నర్‌పేట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది