దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం, కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి ఎక్కువ సమయం పట్టడం ఊరటనిస్తోంది. ఆగస్టు నెలలో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి (డబ్లింగ్) 25రోజుల సమయం పడితే ప్రస్తుతం అది 73రోజులకు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. స్వల్ప కాలంలోనే 25రోజుల నుంచి 73రోజులకు పెరగడం వైరస్ వ్యాప్తి నియంత్రణకు సూచికగా ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా రోజువారీ మరణాల సంఖ్య 1100 నుంచి 600లకు తగ్గడం కూడా ఉపశమనం కలిగించే అంశం.